స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లు గడిచినా మన దేశంలో కనీస మౌలిక వసతులు కరువైన గ్రామాలు ఎన్నో. బడి, గుడి, రహదారి సౌకర్యం లేని ఊర్లు ఎన్నో. అలాంటి ఓ ఊరికి సుమారుగా ఐదు దశాబ్దాల తర్వాత రోడ్డు సౌకర్యం వచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలంలోని కొత్తగళావల్లి గ్రామస్థుల దశాబ్దాల నాటి కల ఎట్టకేలకు నెరవేరింది. సుమారు 55 ఏళ్లుగా సరైన రహదారి లేక నానా అవస్థలు పడుతున్న కొత్తగళావల్లి ప్రజలకు, మంగళవారంతో రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతో పెద్ద ఊరట లభించింది. స్థానిక ఎమ్మెల్యే విజయచంద్ర చొరవతో ఈ రహదారి ఏర్పాటైంది.కొత్తగళావల్లి ఊరిజనం గత ఐదున్నర దశాబ్దాల కాలంగా తమ ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయం మీద ఇప్పటికే పలువురు అధికారులను, ప్రజాప్రతినిధులను వేడుకున్నారు. అయితే గతంలో ఎవరూ దీనిమీద స్పందించలేదు. కానీ పార్వతీపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బోనెల విజయచంద్ర దృష్టికి తీసుకువెళ్లగా.. బోనెల విజయచంద్ర సానుకూలంగా స్పందించారు. సుమారు రూ. 2 కోట్ల నిధులతో రెండు కిలోమీటర్ల మేర తారురోడ్డు, కల్వర్టు నిర్మాణానికి ఏడాది కిందట ఆయన శ్రీకారం చుట్టారు. నిధులను కూడా మంజూరు చేయించారు. మంగళవారం రోజుతో ఆ రహదారి నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి కొత్త కళ వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లాలన్నా, రవాణాకైనా ఇకపై ఇబ్బందులు ఉండవని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రోజున బలిజపేట మండలంలో ఎమ్మెల్యే విజయచంద్ర పర్యటించారు. వెంగాపురం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన ఐ లవ్ వెంగాపురం లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన విజయచంద్ర.. బలిజిపేట మండలంలోని ప్రతి పల్లెను రహదారులతో అనుసంధానం చేయటమే తమ లక్ష్యమన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించేలా చర్యలు తీసుకుంటామని.. త్వరలోనే మండలంలోని మిగిలిన గ్రామాల్లో పెండింగ్లో ఉన్న రహదారి పనులను కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే విజయచంద్ర హామీ ఇచ్చారు.